హైదరాబాద్ స్నేక్ గ్యాంగ్పై నేడు తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠత
స్నేక్ గ్యాంగ్.. అత్యంత కిరాతక నేరాలకు పాల్పడే ముఠా. రెండేళ్ల కిందట హైదరాబాద్ని వణికించిన స్నేక్గ్యాంగ్ కేసు తుది తీర్పును స్థానిక కోర్టు మంగళవారం వెలువవరించనుంది. పాతబస్తీకి చెందిన స్నేక్ గ్యాంగ్ పహాడీషరీఫ్ పోలీస్ ఠాణా పరిధిలో 2014 జులై 31న ఫాంహౌజ్లో చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన అప్పట్లో దుమారం రేపింది. స్నేక్ గ్యాంగ్పై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ అత్యాచారానికి పాల్పడిన ఆ గ్యాంగ్పై 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంతేకాకుండా వారు చేసిన ఆగడాలు కూడా ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వచ్చాయి. దాదాపు రెండేళ్ల పాటు.. కేసులో వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునివ్వనుంది. స్నేక్ గ్యాంగ్ కేసులో మొత్తం 9 మంది నిందితులున్నారు. ఫైసల్ దయాని(ఎర్రకుంట), ఖాదర్ బరాక్బ(ఉస్మాన్నగర్), తయ్యబ్ బసలమ(బండ్లగూడ,బార్కాస్), మహ్మద్ పర్వెజ్(షాయిన్నగర్), సయ్యద్ అన్వర్(షాయిన్నగర్), ఖాజా అహ్మద్ (ఉస్మాన్నగర్), మహ్మద్ ఇబ్రాహీం (షాయిన్నగర్), అలీ బరాక్బ (షాయిన్నగర్), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా చూపించారు.
ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మరో ఇద్దరు బెయిల్పై బయట తిరుగుతున్నారు. స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను హైదరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నేరాలు రుజువైతే నిందితులకు పదేళ్ల జైలు శిక్ష.. లేదా.. జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.