1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 జూన్ 2021 (15:06 IST)

విశాఖలో టీడీపీ నేత పల్లా అక్రమ నిర్మాణాలు కూల్చివేత

సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యాదవ జగ్గరాజుపేట చెరువు ఆనుకుని పల్లా శ్రీనివాస్‌కు చెందిన స్థలం పెన్సింగ్ అక్రమణ అంటూ అధికారులు తొలగించారు. 
 
సర్వే నెం. 14.1లో చెరువుకు చెందిన రెండడుగుల స్థలం ఆక్రమించి పెన్సింగ్ వేశారని అధికారులు చెబుతున్నారు. జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకోవాలని పల్లా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెప్పినా అధికారులు అంగీకరించలేదు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని పల్లా కుటుంబసభ్యులు అన్నారు. కక్ష్య సాధింపులపై దృష్టి పెట్టడం మాని, అభివృద్ధిపై పెట్టాలని సూచించారు.
 
మరోవైపు, జీవీఎంసీ పరిధిలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గాజువాక ఆటోనగర్ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. 
 
టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములకు సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాల భూమిని జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. భారీ పోలీసుల బలగాల మధ్య ఆక్రమణలను రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. 
 
కాగా.. డీపీ గత కొన్ని నెలలుగా విశాఖలో ఆక్రమణల తొలగింపు వేగవంతం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు టీడీపీ సీనియర్ నాయకుల నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేసిన ఘటనలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఏప్రిల్ నెలలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.