శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు - సర్వదర్శనానికి 24 గంటలు
కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు వరుసగా వారాంతపు సెలవులు రావడంతో భక్తులు తిరుమల కొండపైకి పోటెత్తారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలువలికి విస్తరించి బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ కారణంగా సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల పాటు పడుతోంది.
ఆదివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం క్యూలైన్లలో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం లభింంచేందుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 4 నుంచి 6 గంటలు సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులను 5 నుంచి 7 గంటల సమయం పడుతుందని వివరించారు.
తిరుమల్లో నెలకొన్న రద్దీ తీవ్రతను శనివారం నాటి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం ఒక్కరోజే మొత్తం 84,166 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వీరిలో 36,673మంది భక్తులు తలనీనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కానుకల రూపంలో శ్రీవారి హుండీలో రూ.4.08 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తితిదే అదికారులు 4.74 లక్షల లడ్డూలను విక్రయించారు.
