మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (13:06 IST)

ఆ తమిళ సీనియర్ హీరోను చెప్పుతో కొట్టాలంటున్న వాసిరెడ్డి పద్మ

వైకాపా మహిళా నేత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి ఓ తమిళ సీనియర్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తమిళ హీరోను చెప్పుతో కొట్టాలంటూ మండిపడ్డారు. ఇంతకీ ఆ తమిళ హీరో ఎవరో కాదు.. ఎవర్‌గ్రీన్ భాగ్యరాజా. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వారే కారణమంటూ ఈయన వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం ముక్తకంఠంతో ఖండిస్తోంది. దీంతో వాసిరెడ్డి పద్మ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. అత్యాచార ఘటనలపై దారుణ వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాను చెప్పుతో కొట్టాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల మహిళలపై దాడులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పారు. 
 
ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపించే సినీ రంగానికి చెందిన భాగ్యరాజా బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. మహిళలకు ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. భాగ్యరాజాపై తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి తాను లేఖ రాస్తానని చెప్పారు.
 
కాగా, ఇటీవల చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగ్యరాజా పాల్గొని మాట్లాడుతూ, వివాహేతర సంబంధాల కోసం ఈరోజుల్లో మహిళలు భర్తలు, పిల్లల్ని చంపేస్తున్నారు. సెల్ ఫోన్ల వల్ల మహిళలు చెడిపోతున్నారు. రెండేసి సిమ్ కార్డులు వాడుతున్నారు. వారిపై అత్యాచారాలు, వేధింపులకు ఇది కూడా ఒక కారణంగా మారింది. పొల్లాచ్చి అత్యాచార ఘటనలో మగవాళ్ల తప్పు ఏమాత్రం లేదు. పైగా, ఆ అమ్మాయి ఇచ్చిన అవకాశం వల్లే అత్యాచారం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మహిళలు ముక్తకంఠంతో ఖండించారు.