1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (14:17 IST)

నిరుద్యోగులకు శుభవార్త.. భారతీయ రైల్వేలో 492 ఉద్యోగాలు

కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రైల్వే అనుబంధ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ సంస్థ అయిన చిత్తరంజన్‌ లోకోమోటివ్​ వర్క్స్​లో 492 అప్రెంటీస్​ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అప్రెంటీస్​ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ స్పష్టం చేసింది. 
 
ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అర్హత, దరఖాస్తు విధానం, ఫీజు వంటి అన్ని వివరాల కోసం www.apprenticeshipindia.org వెబ్​సైట్​ను సందర్శించాలని అభ్యర్థులను కోరింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, పెయింటర్, ఎసి మెకానిక్ వంటి ఐటీఐ విభాగాల్లో ఖాళీలున్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 2021 సెప్టెంబర్ 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అయితే, రిజర్వేషన్​ నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులకు గరిష్ట వయో సడలింపు ఉంటుంది. 
 
అర్హత విషయానికి వస్తే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాక, సంబంధిత ట్రేడ్​ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.