శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (10:19 IST)

జిత్తులమారి కరోనా... చిక్కకుండా రక్షణ కవచాలు : కొత్త కేసుల్లో నయా రికార్డు

దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69,652 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 977 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 28,36,926 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 53,866కి పెరిగింది. ఇక 6,86,395 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,96,665 మంది కోలుకున్నారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ జిత్తులమారిలా తయారైంది. నిరంతరం తన రూపాన్ని మార్చుకుంటూ శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఆ కారణంగానే ప్రజల ప్రాణాలు హరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 
 
ముఖ్యంగా ఈ కరోనా వైరస్ కూడా మానవ శరీరంలోని డీఎన్ఏనే అని ఏమరపరిచేలా ఓ ఎంజైమును విడుదల చేస్తున్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా, శరీరం విడుదల చేసే యాంటీబాడీలకు చిక్కకుండా వైరస్‌లోని కీలకమైన స్పైక్ ప్రొటీన్‌కు చక్కెరలాంటి అణువులు రక్షణ కవచంలా ఏర్పడుతున్నట్టు జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జయోఫిక్స్ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు.
 
కరోనా వైరస్‌పై ఉండే స్పైక్ (కొమ్ము) ప్రొటీన్ మానవ కణాలను గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ స్పైక్‌లపై చక్కెరలాంటి గ్లైకాన్లు అతుక్కుని ఉంటున్నాయని, ఒక్కో కొమ్ముపై మూడేసి అతుకులు ఉంటున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
స్పైక్ ప్రొటీన్‌లోని తుంటి, మోకాలు, చీల మండలం వంటి భాగాల కారణంగా వైరస్ స్వేచ్ఛగా వంగుతోందని తెలిపారు. శరీరంలోని యాంటీబాడీలు వీటిని గుర్తించే సమయంలో ఈ స్పైక్ ప్రొటీన్‌కు గ్లైకాన్లు రక్షణ కవచంలా అడ్డు నిలుస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.