శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (23:14 IST)

కరోనాతో సుఖసంతోషాలు కరువయ్యాయనీ.. భర్త - పిల్లలను చంపేసిన లేడీ డాక్టర్

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే గల్లంతైపోతున్నాయి. అనేక మంది జీవితాలు ఇప్పటికే ఛిద్రమైపోయాయి. తాజాగా ఈ కరోనా వైరస్ కారణంగా జీవితంలో సుఖసంతోషాలు కరువయ్యాయని బాధపడుతూ ఓ మహిళా వైద్యురాలు తన కుటుంబ సభ్యులను చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెంది. డాక్టర్ సుష్మ రాణె. ఈమె భర్త ధీరజ్ (42). ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. వీరికి 11, 5 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధీరజ్ తల్లి (60)తో కలిసి వీరంతా కొరాడి ప్రాంతంలో నివసిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నిన్న రాత్రి అందరూ నిద్రపోయారు. ఉదయం నిద్రలేచిన ధీరజ్ తల్లి బెడ్రూంలో నిద్రపోతున్న వారిని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి తలపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. 
 
ధీరజ్, ఇద్దరు పిల్లలు బెడ్‌మీద విగతజీవులుగా పడి ఉండగా, వైద్యురాలు సుష్మ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తన జీవితంలో ఆనందం కరవవడంతోనే ఈ పనికి పాల్పడినట్టు డాక్టర్ సుష్మ రాసిన సూసైడ్ నోట్‌ను ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, భర్త, పిల్లలను చంపేందుకు ఉపయోగించిన రెండు సిరింజిలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తొలుత విషం కలిపిన ఆహారాన్ని భర్త, పిల్లలకు తినిపించిన సుష్మ, ఆపై గుర్తు తెలియని ఇంజక్షన్ ఇచ్చి వారిని హత్య చేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.