శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (13:44 IST)

విజయవాడ దుర్గ గుడిలో కరోనా కలకలం, సిబ్బందికి పెరుగుతున్న కేసులు

కరోనావైరస్ అన్ని ప్రాంతాలలో తన ఉగ్ర పంజాను విసురుతున్నది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత పేరుగాంచిన ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. ఇక్కడ కరోనా సెగ తగిలింది. సిబ్బందికి నిర్వహించిన రెండుసార్లు పరీక్షలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
 
మిగిలిన వాటితో పోలిస్తే కేసులు తక్కువే అయినా ఒకసారి ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ బెజవాడ దుర్గగుడి సిబ్బందిని వణికిస్తోంది. ఇప్పటికే ఆలయంలో కీలక అధికారితో పాటు ఐదుగురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురుకి పాజిటివ్ రావడం ఇంద్ర కీలాద్రిపై చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రెండుసార్లు సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించగా గతంలో ఓ వేదపండితుడు, ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.
 
అయితే వారకి కరోనాతో పాటు ఇతర శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన వారు సురక్షితంగా బయట పడ్డారు. తాజాగా గత వారం దుర్గ గుడిలో రెండోసారి 393 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్ గా తేలింది. కాగా 450 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
 
కరోనా పరీక్షలు చేసేవరకు వ్యాధి బయట పడటం లేదు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండపై పరిస్థితి మారిపోయింది. ఆలయంలో రోజు శానిటైజ్ చేసినా, మాస్కులు ధరించినా రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడ్డారనే సమాచారం వస్తూ ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.