మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By మోహన్
Last Modified: శుక్రవారం, 29 మే 2020 (18:07 IST)

డీడీ న్యూస్‌ను తాకిన కరోనా వైరస్ ప్రభావం..

కరోనాతో ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి. కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. రోజూ వందల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ కరోనా వల్ల చనిపోయాడు. దీంతో అప్రమత్తమైన డీడీ న్యూస్ ఛానెల్ యాజమాన్యం ఆ ఛానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ ఛానెల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న యోగేశ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అయితే అనుమానంతో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. ఫలితంగా ఆ ఛానెల్‌లోని అదే విభాగంలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలు చేయనున్నారు. డీడీ న్యూస్ ఛానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
 
ఆఫీస్‌ను శానిటైజేషన్ చేసిన తర్వాత త్వరలోనే తెరుస్తామని, అలాగే ఆఫీస్ మూతపడటం వల్ల వార్తాప్రసారాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు ఆ ఛానెల్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ యోగేష్ మృతితో కెమెరా విభాగానికి చెందిన సిబ్బంది మొత్తాన్ని డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆ ఛానెల్ అధికారులు తెలిపారు.