1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (12:45 IST)

దేశంలో కరోనా కల్లోలం.. రెండు మాస్క్‌లతోనే రక్షణ!

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా దేశంలో లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ముఖానికి రెండు మాస్కులు ధరించడం ప్రయోజనకరమని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
దీనివల్ల కరోనా వైరస్‌ పరిమాణంలోని రేణువులను వడకట్టే సామర్థ్యం రెట్టింపవుతుందని వ్యాఖ్యానించారు. వీటిని ధరించిన వారి ముక్కు, గొంతులోకి అవి ప్రవేశించకుండా చాలావరకూ రక్షణ లభిస్తుందని తెలిపారు. అయితే ఈ మాస్కులు.. ముఖంపై దృఢంగా అమరేలా చూసుకోవాలన్నారు. 
 
'రెండు ముఖ తొడుగులు అంటే.. ఒక మాస్కుకు మరో పొరను జోడించడం కాదు. అవి ముఖానికి సరిగా అమరేలా చూసుకోవాలి. ఎక్కడా ఖాళీ లేకుండా పూర్తిగా కప్పేసేలా ఉండాలి' అని వ్యాఖ్యానించారు. 
 
ఉత్తర కరోలైనా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ సిక్‌బెర్ట్‌ బెనెట్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. సర్జికల్‌ మాస్కులను చాలా ఎక్కువ వడపోత సామర్థ్యం ఉండేలా డిజైన్‌ చేశారని ఆమె తెలిపారు. అయితే అవి మన ముఖాలకు సరిగా అమరవని వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో వివిధ రకాల మాస్కులు సామర్థ్యాన్ని పరీక్షించినట్లు తెలిపారు. తల వంచడం, మాట్లాడటం, తల పక్కకు తిప్పి చూడటం వంటి సాధారణ చర్యలను అనుకరించి, ఆ సమయంలోనూ మాస్కుల సామర్థ్యాన్ని పరిశీలించామన్నారు. 
 
ఒక వ్యక్తి ముఖానికి అనుగుణంగా మార్పులు చేయని మాస్కులు.. కరోనా వైరస్‌ పరిమాణంలోని రేణువులను వడకట్టడంలో 40-60 శాతం సమర్థతను ప్రదర్శించాయని చెప్పారు. వస్త్రంతో చేసిన ముఖ తొడుగు 40 శాతం సమర్థతతో పనిచేస్తోందని వివరించారు.