శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 మే 2020 (08:51 IST)

మహారాష్ట్ర మాజీ సీఎంకు కరోనా... 50 వేలు దాటిన పాజిటివ్ కేసు

మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిశరవేగంగా ఉంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు మించిపోయాయి. అదేసమయంలో ఈ రాష్ట్రంలోని పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ సీఎంలు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌కు కరోనా వైరస్ సోకింది. కాంగ్రెస్ నేత అయిన ఈయన ప్రస్తుత మంత్రివర్గంలో ప్రజా పనుల శాఖామంత్రిగా ఉన్నారు. 
 
ఈయన తరచూ ముంబై నుంచి తన స్వగ్రామమైన మరఠ్వాడాకు వెళ్లి వస్తుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనకు వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. 
 
మరోవైపు, ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవద్ కూడా కరోనా బారినపడ్డారు. రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 3,041 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి. 
 
అలాగే, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,635కు చేరింది. తాజాగా మరణించిన వారిలో 39 మంది ముంబైకి చెందినవారు కావడం గమనార్హం.