ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (09:33 IST)

కరోనా విజృంభణ.. బెంగళూరుకు వెళ్ళాలంటే కోవిడ్ నెగటివ్ తప్పనిసరి

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇలా కర్ణాటక ప్రభుత్వం వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తోంది. వచ్చేనెల నుంచి బెంగళూరుకు వస్తే కొవిడ్‌ నెగెటివ్‌ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష రిపోర్ట్‌ వెంట తీసుకురావాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి కే సుధాకర్‌ స్పష్టం చేశారు. 
 
బెంగళూరులో బుధవారం 1400, గురువారం 1623 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత ఈ మొత్తం కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇటీవల పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయని, అయితే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల్లోనే ఎక్కువగా వైరస్‌ జాడలు కనిపిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
 
ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, చండీగఢ్‌ ప్రాంతాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు ఉండగా.. వచ్చే నెల నుంచి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు. వైరస్‌ బారినపడ్డ వారిని గుర్తించి.. వేరే చేసేందుకు పాజిటివ్‌గా పరీక్షించిన వారి చేయిపై స్టాంప్‌ వేయాలని నిర్ణయించారు.
 
వైరస్‌ ఉధృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో అవసరమైన పడకలను హాస్పిటళ్లలో పెంచనున్నట్లు తెలిపారు.