శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:22 IST)

జపాన్‌లో అలజడి సృష్టిస్తున్న కొత్త వైరస్...

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ అనేక దేశాల్లో అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో విలయతాండవం చేస్తున్న కరోనా.. పలు దేశాల్లో రెండు, మూడు, నాలుగు దశల్లో వ్యాప్తి చెందుతోంది. తాజాగా జపాన్‌లో ఫోర్త్ వేవ్ మొదలైంది. 
 
జపాన్ రాజధాని టోక్యో నగరంలో మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్‌ మొదలుకానున్న తరుణంలో కరోనా నాలుగో వేవ్‌ అలజడి సృష్టిస్తోంది. నిరంతరం పెరుగుతున్న కేసులతో అల్లాడుతున్న తరుణంలోనే.. కొత్తరకం వైరస్‌ వేరియంట్లు భయపడుతున్నాయి. 
 
నిత్యం జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి వస్తుండటంతో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో బ్రిటన్‌ వేరియంట్‌ కేసులు అధికంగా నమోదు అవుతుండడం పట్ల నిపుణులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. 
 
ఒసాకా నగరంలో ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఈక్‌’ (EEK – E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో నగరంతోపాటు మరికొన్ని చోట్ల ఈక్‌ మ్యుటేషన్‌ విస్తరిస్తోంది. 
 
అయితే.. టోక్యోలో వెలుగులోకి వస్తున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసుల్లో ఈక్‌ వేరియంట్‌ నిర్థారణ అయినట్లు జపాన్‌ అధికారులు తెలిపారు. అయితే ఈ మ్యుటేషన్‌ వ్యాక్సిన్‌ సామర్ధ్యాన్ని కూడా తగ్గించేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
అలాగే, భారత్‌లోనూ రెండో దశ సంక్రమణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. మహారాష్ట్రలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.