1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

ఏ వయసు పిల్లలు మాస్క్ ధరించాలి : డబ్ల్యూ‌హెచ్ఓ క్లారిటీ

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ వైరస్ బారినపడుకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి మందు లేకపోవడంతో ముఖానికి మాస్క్ ధరించడం ఒక్కటే మందు అని వైద్యులు అంటున్నారు. తద్వారా ఈ వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 
అయితే, ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అందరూ మాస్కులు ధరిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కుల విషయంలో తాజాగా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు పెద్దలకు మాదిరిగానే కరోనా వచ్చే అవకాశాలు ఉండడంతో వారు పెద్దలు ధరించినట్టుగానే మాస్కులు ధరించాలని పేర్కొంది. 
 
ఐదేళ్లలోపు పిల్లలు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరికాదని, వీరికి కరోనా సోకే ప్రమాదం తక్కువని పేర్కొంది. 6 నుంచి 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వివరించింది. పిల్లలు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని తెలిపింది.