1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Sri Lankan coach dies after altercation with cricketer in Colombo

క్రికెటర్ల మధ్య గొడవ.. సీనియర్ కోచ్ సుమిత్ ఫెర్నాండో దారుణం హత్య

murder
శ్రీలంక క్రికెట్‌లో దారుణం జరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ సీనియర్ కోచ్ సుమిత్ ఫెర్నాండో (62) దారుణ హత్యకు గురయ్యాడు. వన్డే జట్టు కెప్టెన్ కుశాల్ మెండిస్ వంటి ఎందరో యువ క్రికెటర్లతో ఓనమాలు దిద్దించారు. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య చెలరేగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించిన ఆయన, దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తాగునీటి విషయంలో చెలరేగిన ఓ చిన్న గొడవ ఆయన ప్రాణాలను బలిగొంది.
 
పోలీసుల కథనం ప్రకారం, ఆగస్టు 8న కొలంబోలోని ఓ క్రీడా ప్రాంగణంలో ఈ విషాద ఘటన జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు యువ ఆటగాళ్లు తాగునీటి కోసం వెళ్లగా, కుళాయిలో నీళ్లు రాలేదు. దీంతో స్టేడియం సిబ్బందికి, ఆటగాళ్లకు మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న సుమిత్ ఫెర్నాండో కలుగజేసుకుని, గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ 17 ఏళ్ల స్కూల్ క్రికెటర్ ఆయనపై దాడి చేయడంతో సుమిత్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కొలంబో నేషనల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 11న ఆయన తుదిశ్వాస విడిచారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన 17 ఏళ్ల విద్యార్థిని ఆగస్టు 10న అరెస్టు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో కోర్టు అతడిని బాలల సంరక్షణ గృహానికి తరలించింది. విచారణలో భాగంగా అతడి కస్టడీని ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుమిత్ ఫెర్నాండో మొరటువాలోని 'ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజ్'లో కోచ్గా పనిచేస్తూ ఎందరో జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దారు. ఆయన మృతి పట్ల శ్రీలంక క్రికెట్ బోర్డు, పలువురు దిగ్గజ క్రీడాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సీబీఎస్‌ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు మూడు జట్లతో ఎంపికై సత్తా చాటిన ఎస్వీఐఎస్