మంగళవారం, 2 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

సెంచరీ మిస్ అయినందుకు బాధ లేదు... కాసేపు టెస్ట్ క్రికెట్ ఆడేయమన్నాడు.. కేఎల్.రాహుల్

kl rahul
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా, ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి అంచులను అధికమించి గెలుపొందింది. ఈ మ్యాచ్‌ను మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు గెలిపించారు. ఈ ఇద్దరు మొనగాళ్లు అద్భుతమైన ఆటతీరుతో ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మూడు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీనిపై కేఎల్ రాహుల్ స్పందించారు.
 
మరో మూడు పరుగులు చేసివుంటే సెంచరీ చేసే అవకాశం ఉందనీ, కానీ వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలు ముఖ్యమన్నారు. అందువల్ల శతకం మిస్ అయిందనే బాధేం లేదని జట్టు విజయమే ముఖ్యమని రాహుల్ చెప్పుకొచ్చారు. 
 
200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... మ్యాచ్ ఆరంభంలో రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. అపుడు క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్... భారత ఇన్నింగ్స్‌కు అడ్డుగోడగా నిలవడమే కాకుండా జట్టును కూడా గెలిపించారు. అయితే కీలకమైన మూడు వికెట్లు పడినప్పుడు క్రీజ్‌లోకి వచ్చా. అయితే, మరీ ఎక్కువగా కంగారు పడిపోలేదు. విరాట్‌ కోహ్లీతో వికెట్‌ గురించి ఎక్కువగా చర్చించలేదు. కానీ దాని గురించి మాట్లాడుకున్నాం. 
 
అప్పుడు కోహ్లీ ఒకటే మాట చెప్పాడు. పిచ్‌ చాలా క్లిష్టంగా ఉంది. టెస్టు మ్యాచ్‌ ఆడినట్లు కాసేపు ఆడాలని సూచించాడు. ఆరంభంలో కొత్త బంతి వేసిన పేసర్లకు సహకరించింది. ఆ తర్వాత స్పిన్నర్లకూ హెల్ప్‌గానే ఉంది. అయితే, చివరి 15-20 ఓవర్లప్పుడు మాత్రం తేమ ప్రభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. బౌలర్లకు బంతిపై పట్టు దొరకలేదు. అయితే, చెన్నై పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం సులభమేమీ కాదు. ఇది చాలా మంచి క్రికెట్ వికెట్. 
 
బ్యాటర్లు, బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది. చివరిగా సిక్స్‌ను అద్భుతంగా కొట్టా. అయితే, సెంచరీ చేయడానికి ఎన్ని పరుగులు అవసరం..? ఎలా చేయాలి? అనే దానిపై అవగాహన ఉంది. అప్పటికి భారత్ విజయానికి ఐదు పరుగులు అవసరం. వరుసగా ఫోర్, సిక్స్‌ కొడితే సెంచరీ అవుతుంది. కానీ బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. శతకం మిస్‌ అయినందుకు నాకేం బాధ లేదు. జట్టు విజయం సాధించింది. అదే ముఖ్యం' అని రాహుల్ అన్నారు.