1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (10:30 IST)

సామర్లకోటలో నడిరోడ్డుపై యువకుడు నరికివేత

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. గత పది రోజుల వ్యవధిలో నలుగురు మహిళలపై అత్యాచారం జరిగింది. ముఖ్యంగా, ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో పొట్టచేతపట్టుకుని వచ్చిన ఓ వలసకూలీ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారం జరిపారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. తాజాగా కాకినాడి జిల్లా సామర్లకోటలో పట్టపగలు, నడిరోడ్డుపై ఓ యువకుడిని నరికి చంపేశారు. అదీకూడా అందరూ చూస్తుండగా సాటి స్నేహితుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక భాస్కర్ నగరులో నివసిస్తున్న తలాటి శివ (28) అనే వ్యక్తి తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో నరాల మణికంఠ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, వీరి మధ్య వివాదం తలెత్తడంతో అక్కడ నుంచి వచ్చేసి సోదరుడితో కలిసి భాస్కర్ నగరులో ఉంటున్నాడు. 
 
అయితే, శివపై ప్రతీకారం తీర్చుకోవాలని రగలిపోతూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం పుట్టినరోజు కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన మణికఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడి చేశాడు. 
 
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.