ఇజ్రాయెల్ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్
కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంలో ఇజ్రాయెల్ నిబద్ధతపై పలు అనుమానాలు ఉన్నట్లు ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి తెలిపారు. ఒకవేళ శత్రుదేశం ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి దాడులు చేసినా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సౌదీ అరేబియా రక్షణశాఖ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్తో ఆదివారం జరిగిన భేటీ సందర్భంగా మౌసావి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాల్పుల విరమణ షరతులకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా? లేదా? అన్నదానిపై మాకు చాలా సందేహాలున్నాయి. అందుకే మేం అప్రమత్తంగా ఉన్నాం. ఒకవేళ శత్రుదేశం మరోసారి దాడులు చేస్తే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఖచ్చితంగా బదులిస్తాం' అని మౌసావి అన్నారు. ఇరాన్ ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభించలేదని, కేవలం ఇజ్రాయెల్ దాడులకు పూర్తి స్థాయిలో ప్రతిస్పందించిందన్నారు. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన 6 రోజుల తర్వాత ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా జూన్ 13 నుంచి ఇజ్రాయెల్ గగనతల దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
అక్కడికి 12 రోజుల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ, రెండు దేశాలూ గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. శత్రుదేశం కదలికలపై దృష్టి పెట్టాయి. ప్రతిదాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.