కృత్రిమ మేధ దూకుడుకు కళ్లెం వేయాల్సిందే : టెక్ దిగ్గజాలు
కృత్రిమ మేధ (ఏఐ) దూకుడుకు కళ్లెం వేయాల్సిందేనని పలువురు టెక్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏఐ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం తెల్సిందే. ఇదే వేగం మున్ముందు కనిపిస్తే వచ్చే పదేళ్లలో పదిశాతానికి పైగా మనుషులు ఏఐ కారణంగానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల పేర్కొన్న విషయం తెల్సిందే.
తాజాగా ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ సైతం కృత్రిమ మేధతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ సాంకేతిక వేగానికి ఇకనైనా కళ్లెం వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాల పెంపును తగ్గించాలని కంపెనీలను కోరారు. ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్, ఎక్స్ఏఐ అధిపతి ఎలాన్మస్క్ సైతం డారియో అభిప్రాయానికి మద్దతు పలికారు.
స్వయంగా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను రూపొందిస్తుండడంతో.. తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం ఏఐ వ్యవస్థల్లో పెరుగుతోందని డారియో ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో కృత్రిమ మేధకు చెందిన ఏజెంట్లు బాహ్య వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయాలను గుర్తు చేశారు. ఏఐని ఇలాగే వదిలేస్తే అది త్వరలోనే స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో 6-12 నెలల్లో ఆ సమూహం మొత్తం ఇంటర్నెట్ను స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే కొన్ని వందల బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అయితే, తాను సాంకేతిక పురోగతిని పూర్తిగా నిలిపివేయాలని చెప్పట్లేదన్నారు. దానికి బదులుగా, కంపెనీలు తమ మోడళ్ల భద్రతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి ఏఐ కంపెనీలకు మరింత సమయం అవసరమని డారియో పేర్కొన్నారు.

