శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (06:56 IST)

భారత్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడులు... అయినా సీఈవోకు దొరకని మోదీ అపాయింట్‌మెంట్

దేశంలోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకుగాను భారత్‌లో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపుగా రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ తెలిపారు.

న్యూ ఢిల్లీలో నిర్వహించిన సంభవ్‌ సమ్మిట్‌కు అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెఫ్‌ బెజోస్‌ మాట్లాడుతూ... 2025 వరకు 10 బిలియన్‌ డాలర్ల విలువైన మేకిన్‌ ఇండియా ఉత్పత్తులను అమెజాన్‌ ఎగుమతి చేసేలా లక్ష్యాలు నిర్దేశించుకున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో భారత్‌, అమెరికాల మధ్య మరింత సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బెజోస్‌ తన భారత్‌ పర్యటనలో భాగంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, చిన్న తరహా వ్యాపారులతో సమావేశం కానున్నారు.
 
దొరకని మోదీ అపాయింట్‌మెంట్
భారత్‌లో పర్యటిస్తోన్న అపర కుబేరుడు అమెజాన్ సిఈఓ బెజోస్‌కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇంకా దొరకలేదు. ఈ కామర్స్ మార్కెట్ ద్వారా ప్రకంపనలు సృష్టిస్తోన్న బెజోస్‌‌దే వాషింగ్టన్ పోస్ట్ కూడా.

వాషింగ్టన్ పోస్ట్‌లో వరుసగా భారత వ్యతిరేక వార్తలు వస్తున్న కారణంగా బెజోస్‌కు ఇంకా మోదీ అపాయింట్‌మెంట్ దొరకలేదని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం భారత్‌లోని మైనార్టీలు భయభయంగా ఎదురు చూస్తున్నారని ఓ సారి రాశారు.

మరోసారి జమ్మూ కశ్మీర్‌లో ప్రజలకు స్వేచ్ఛ లేదని కూడా రాశారు. ఇలాంటి కథనాలు కోకొల్లలుగా వచ్చాయి. వాస్తవం ఒకటైతే అందుకు భిన్నంగా తప్పుడు కథనాలిచ్చారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.