శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (18:12 IST)

వేరొక వ్యక్తితో చాటింగ్.. భర్త పిల్లల్ని మరిచిన భార్య.. చివరికి..?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో అనుబంధాలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్న కాలమిది. ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇలా ఏదో ఒక సామాజిక మాధ్యమ వేదికలో గంటల కొద్దీ కాలం గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా అపరిచిత వ్యక్తుల కోసం ప్రాణాలు తీస్తున్నారు లేదా ప్రాణాలు తీసుకుంటున్నారు. తమిళనాడులో తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపూర్ సమీపంలోని పెరుమానల్లూర్ ఐయ్యం పాలయానికి చెందిన వెంకటేశన్ రోజూ కూలి పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య రేవతి (32), ఇద్దరు పిల్లలను తన రెక్కల కష్టంతో చూసుకుంటున్నాడు. వీరి కాపురం సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఫేస్‌బుక్‌లో రేవతికి తిరువారూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా కాపురంలో చిచ్చు పెట్టింది. 
 
రేవతి గంటల కొద్దీ ఆ వ్యక్తితో చాటింగ్ చేస్తుండటాన్ని భర్త వెంకటేశన్ గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. ముక్కూముఖం తెలియని వ్యక్తులతో పరిచయాలు మంచిది కాదని హెచ్చరించాడు. అయితే.. రేవతి మాత్రం భర్త మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆమె ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. అతనితో చాటింగ్ చేస్తూనే ఉంది. 
 
ఈ క్రమంలోనే.. ఆదివారం కూడా రేవతి ఆ వ్యక్తితో చాటింగ్ చేస్తుండగా ఆమె భర్త చూశాడు. చెప్పిన మాట లెక్కచేయకపోవడంతో వెంకటేశన్ తీవ్రంగా ఆగ్రహించాడు. భార్య రేవతిపై పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఆమెను చెడామడా తిట్టేసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
 
భర్త మాటలకు రేవతి తీవ్ర మనస్తాపం చెందింది. పిల్లలు బయటకు వెళ్లి ఆడుకుంటుండగా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అపరిచిత వ్యక్తితో పరిచయం రేవతి నిండు ప్రాణం తీసింది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి ఇద్దరు పిల్లలకు కన్నతల్లిని దూరం చేసింది. రేవతి ఆత్మహత్యపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు.