శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (11:43 IST)

దీపావళి రోజున శ్రీవారిని దర్శించుకుంటే..?

కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్‌ ఏడో తేదీన దీపావళి ఆస్థానం జరగనుంది. అలాగే తొమ్మిదో తేదీన శ్రీ తిరుమల సంబి శాత్తుమొర, 12న శ్రీసేనై మొదలియార్‌ వర్ష తిరునక్షత్రం, 14న శ్రీవారికి పుష్పయోగ మహోత్సవం, శ్రీ తిరుమంగై అళ్వార్‌ ఉత్సవం ఆరంభం, 15న శ్రీపూదత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం, 20న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీచక్రతీర్థ ముక్కోటి, 23న శ్రీతిరుమంగై ఆళ్వార్‌ శాత్తుమొర, 24న శ్రీతిరుప్పాణాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం తదితర పూజాధికాలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో దీపావళి రోజున శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునే వారికి సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు. సిరిసంపదలను.. ఐశ్వర్యాన్ని ఇచ్చే శ్రీ మహాలక్ష్మిని మదిలో వుంచుకున్న శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని వారు చెప్తున్నారు. అలాగే దీపావళి రోజున ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. 
 
ఆ రోజున తిరుమల మలయప్ప స్వామి విశేషమైన ఆభరణాలతో అలంకృతమై మాడ వీధుల్లో సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. సర్వభూపాల వాహనంపై దీపావళి రోజున ఊరేగే మలయప్పను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సకలసంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
విశ్వంలోని పరిపాలకులందరూ శ్రీనివాసుడిని తమ భుజాలపై మోసి ధన్యులవుతారు. అందుకు ప్రతీకయే సర్వభూపాల వాహనం. అంతటి విశిష్టమైన ఈ వాహనంపై విహరించే శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే శ్రీవారిని దీపావళి రోజున దర్శించుకోవడం ద్వారా సకల సంతోషాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.