శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (13:27 IST)

శ్రావణ పూర్ణిమ.. తులసీ దళాన్ని మరిచిపోవద్దు..

రాఖీ పౌర్ణమినే శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆ శ్రావణ పూర్ణిమ (ఆదివారం 26 ఆగస్టు 2018) రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయి. తులసి మొక్క ఇంట వుంటే క్షుద్ర శక్తుల బాధ వుండ

రాఖీ పౌర్ణమినే శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఆ శ్రావణ పూర్ణిమ (ఆదివారం 26 ఆగస్టు 2018) రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయి. తులసి మొక్క ఇంట వుంటే క్షుద్ర శక్తుల బాధ వుండదని నమ్మకం. అలాంటి తులసీ దళంతో శ్రావణ పూర్ణిమ రోజున సత్యనారాయణ స్వామిని అర్చించిన వారికి సకల సంతోషాలు చేకూరుతాయి. 
 
తులసీ దళాలతో నారాయణ స్వామి అయిన సత్యనారాయణ స్వామిని అర్చిస్తే.. ఈతిబాధలుండవు. శ్రీ మహా విష్ణువు తులసీ మాల ధరించడం ద్వారానే దామోదరుడైనాడని పండితులు చెప్తుంటారు. దేవతా నామ సంఖ్యాజపములకు తులసీ మాల వాడటం విశేషం. తులసీ దళాలు భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తారు. ఇది అనారోగ్యాలు దూరం చేస్తుంది. 
 
తులసీ చెట్టు విష కీటకాలను ఇంట్లోకి చేరనివ్వదు. తులసి దళము కంటికి తెలియని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. తులసీ ఆకు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. తులసి నారాయణునికి అతి ప్రీతిపాత్రమైంది. 
 
జపతపాదులు నిర్వహించేవారికి తామర, రుద్రాక్ష పూసల కంటే తులసీ మాల శ్రేష్ఠమైనది. ఇది శరీరంపై ధరించడం ద్వారా సత్వగుణంతో పాటు ఆరోగ్యప్రదం చేకూరుతుంది. అందుకే తులసీ దళాలతో నారాయణ స్వామిని అర్చించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
కార్తీక పౌర్ణమి రోజున లేదా శ్రావణ పూర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన 'రత్నాకరుడు'కి ఇచ్చిన మాట కోసమే 'అన్నవరం'లోని రత్నగిరిపై ఆవిర్భవించాడు.
 
భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు. 
 
సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ వ్రత కథల్లోనే కనిపిస్తుంది. అంకితభావంతో... నియమనిష్టలతో ఈ వ్రతం చేసినవారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.
 
సమస్త దోషాల నుంచి ... సమస్యల నుంచి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీకమాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది. కార్తీక పౌర్ణమి రోజున లేదా శ్రావణ పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.