శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (23:39 IST)

నాలుగవ శ్రావణ శుక్రవారం, శ్రీమహాలక్ష్మిని పూజిస్తే...

నాలుగో శ్రావణ శుక్రవారం. ఈ రోజు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.
 
శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
 
అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.
 
గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి. శ్రావణ మాసంలోని ఈ ఆఖరి శుక్రవారం రోజున అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం.