ఘనంగా అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలు.. శ్రీవారి సేవలో ప్రముఖులు
పదకవితా పితామహుడు అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా నిర్వహించింది. అలిపిరి పాదాల మండపం నుంచి అన్నమయ్య వంశస్థులతో పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తబృందం మెట్లోత్సవంలో పాల్గొన్నారు.
అన్నమయ్య స్వామివారిపై రాసిన కీర్తనలు ఆలపిస్తూ అలిపిరి పాదాల మండపం నుంచి భక్త బృందాలు తిరుమలకు బయలుదేరాయి. మెట్లోత్సవాన్ని టిటిడి జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. మెట్లోత్సవంలో స్వామివారి వేషధారణలతో పాటు అన్నమయ్య వేషధారణలను భక్తులు ధరించారు. ఈ వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇకపోతే.. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనా సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్, ఏపీ శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్రెడ్డి, ఏపీ అదనపు డీజీ ఠాగూర్లు స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు తీర్థప్రసాదాలను తితిదే అధికారులు అందజేశారు.
