కృష్ణా పుష్కరాలకు సిద్ధం కావాలి : తితిదే ఈవో సాంబశివరావు
వచ్చే ఆగస్టు నెలలో జరుగనున్న కృష్ణా పుష్కరాలకు గతం కంటే మరింత మెరుగ్గా తితిదే తరపున ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి కార్యనిర్వహణాధికారి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సీనియర్ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత కట్టుదిట్టంగా తితిదే తరపున ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. సప్తగిరి మాస పత్రికకు తిరుమల, తిరుపతి, ఇతర ప్రాంతాల నుంచి ప్రతినెలా వందలాది మంది చందాలు వస్తున్నాయని, ఇప్పటివరకు ఉన్న చందాల జాబితాను రూపొందించాలని సూచించారు.
వీటిని సరిచూసుకుని పత్రిక చేరని వారికి వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆరు బాషల సప్తగిరి మాసపత్రికను ఎలాంటి జాప్యం లేకుండా చందాదారులకు అందించేందుకు వీలుగా కంప్యూటర్ అప్లికేషన్ను రూపొందించాలని ఆదేశించారు.
