గంటన్నరలో శ్రీవారి దర్శనం... భద్రాద్రి, ఒంటిమిట్టకు భక్తజనం....
శనివారం.. కలియుగ వైకుంఠునికి ఇష్టమైన రోజు. అందుకే ప్రతి శనివారం భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఈ శనివారం మాత్రం తిరుమలలో రద్దీ కనిపించలేదు. పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉండటమూ, శ్రీరామ నవమి పండుగతో అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్ట దేవాలయాలకు భక్తులు తరలివెళ్లడం వల్ల రద్దీ లేకుండా ఉండటానికి కారణమని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
నిన్న రద్దీతో కిటకిటలాడిన తిరుమల శనివారం తెల్లవారుజాముకి ఖాళీగా మారింది. గంటలన్నరలోనే సర్వదర్శనం, కాలినడక భక్తులకు దర్శన భాగ్యం లభిస్తోంది. శనివారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,357మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం 2 కోట్ల 36 లక్షల రూపాయలు వచ్చింది.
