తిరుమలపై డేగ కన్ను... 38 కొత్త పోస్టులు
నిజమే.. తిరుమల లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంపై నిఘా మరింత పెరుగుతోంది. తితిదే నిఘా, భద్రతా విభాగం మరింత పటిష్టం కానుంది. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 38 పోస్టులతో ఈ విభాగం పనితీరు బాగా మెరుగుపడనుంది. అంతర్గతంగా మళ్ళీ పని విభజన జరుగనుంది. స
నిజమే.. తిరుమల లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంపై నిఘా మరింత పెరుగుతోంది. తితిదే నిఘా, భద్రతా విభాగం మరింత పటిష్టం కానుంది. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 38 పోస్టులతో ఈ విభాగం పనితీరు బాగా మెరుగుపడనుంది. అంతర్గతంగా మళ్ళీ పని విభజన జరుగనుంది. సెక్టార్లు ఇప్పుడున్న దానికన్నా పెరుగనున్నాయి.
తితిదే ప్రాధాన్యత రానురాను పెరుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయం సహా తితిదే నిర్వహిస్తున్న ఆలయాలు అత్యంత సున్నిత ప్రాంతాలుగా మారుతున్నాయి. 2,600 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన తితిదే కార్యకలాపాలు బాగా విస్తరిస్తున్నాయి. తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అందుకు తగినట్లుగా భద్రతా, నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రస్తుతం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (సివిఎస్ఓ), అడిషనల్ సివిఎస్ఓ, ఇద్దరు విఎస్ఓలు, 10 మంది ఎవిఎస్ఓలు, ఆరుగురు విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 17.05.2016వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబర్.82 ద్వారా ఒక విఎస్ఓ, జిఓ నెంబర్ 82 ద్వారా ఆరుగురు ఎవిఎస్ఓలు, 17మంది విజిలెన్స్ ఇన్స్స్పెక్టర్లు , 14మంది విజిలెన్స్ గార్డుల పోస్టులు మంజూరు చేసింది. అంటే ఇకపై తితిదేకి సివిఎస్ఓ, అడిషనల్ సివిఎస్ఓతో పాటు ముగ్గురు విఎస్ఓలు, 16మంది ఎవిఎస్ఓలు, 23మంది విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు, గార్డులు ఉంటారు. అదనపు సిబ్బంది కావాలని కోరుతూ 2007లోనే తితిదే విజిలెన్స్ విభాగం ప్రతిపాదనలు సిద్థం చేసింది.
ఈ ప్రతిపాదనలో కూడిన లేఖను 10.09.2015వతేదీన ఈఓ సాంబశివరావు మరోసారి ప్రభుత్వానికి లేఖ పంపారు. తితిదేలో అదనపు సిబ్బంది అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు 38పోస్టులు మంజూరు చేసింది. తితిదేకి సంబంధించిన ఆలయాలు, కళ్యాణ మండపాలు, విద్యాసంస్థలు..అన్నింటిని 10సెక్టార్లుగా విభజించుకుని విజిలెన్స్ విభాగం పనిచేస్తోంది. ఒక్కో విభాగానికి ఒక ఎవిఎస్ఓ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కింద విజిలెన్స్ ఇన్స్ పెక్టర్లు, గార్డులు ఉంటారు. సిబ్బంది కొరత వల్ల తిరుపతిలో మూడు నాలుగు ఆలయాలను కలిపి ఒకే సెక్టార్గా పరిగణిస్తున్నారు. ఆరుగురు ఎవిఎస్ఓలు కొత్తగా వస్తే మొత్తం సెక్టార్లు 16కు పెరుగుతాయి. ఈ మేరకు పని విభజన జరుగుతుంది.
సెక్టార్ల పరిధి ఇప్పుడున్న దానికంటే చిన్నది అవుతుంది. అదేవిధంగా ప్రతి సెక్టార్లోను కనీసం ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు. దీనివల్ల నిఘా పెరుగుతోంది. తిరుపతిలోని సిసి కెమెరాల కంట్రోల్ రూమ్, తిరుమలలోని సిసి కెమెరాల కంట్రోల్ రూమ్, మాస్టర్ కంట్రోల్ రూమ్ వంటి కీలకమైన ప్రాంతాలను మరింత దగ్గరగా పర్యవేక్షించే వెసులుబాటు కలుగుతోంది. అదనపు పోస్టుల వల్ల సిబ్బందిపైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రభుత్వం అనుమతించిన పోస్టుల మేరకు పోలీసు విభాగం నుంచి సిబ్బందిని డిప్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్దస్థాయిలో సెక్యూరిటీని నియమించడం వల్ల తిరుమల చుట్టూ ఎప్పుడూ పటిష్ట భద్రత రానుంది.