తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు... భద్రత మరింత పటిష్టం
తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శన సమయంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ కుమార్ సిన్హాతోపాటు సుప్రీంకోర్టు జడ్జి ఆర్.కే.అగర్వాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాముడు, కన్నడ ప్రముఖ నటుడు రాక్ స్టార్ వెంకటేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర ప్రముఖులకు టిటిడి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయక మంటపంలో ప్రముఖులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను టిటిడి అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ రాముడు మాట్లాడుతూ... ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో భద్రతను మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు వచ్చిన సమాచారంతో ఆంధ్రలోని అన్ని పుణ్యక్షేత్రాలకు భద్రతను పటష్టం చేసినట్లు వెల్లడించారు. త్వరలో అదనపు బలగాలను కూడా ఆలయాల దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, తదితర ఆలయాల్లో కూడా భద్రతను పెంచనున్నట్లు ఆయన వివరించారు.
