శీఘ్ర దర్శనంకు కొత్త క్యూలైన్లు సిద్ధం.. ఉగాది నుంచి ప్రారంభం
శ్రీవారి భక్తుల కోసం శీఘ్ర దర్శనం కోసం కొత్త క్యూ లైన్లను సిద్ధం చేశారు. తిరుమల క్యూకాంప్లెక్స్ పక్కనే ఉన్న కార్ పార్కింగ్ ఏరియాలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో 300 రూపాయల టిక్కెట్ తీసుకునే భక్తులను శీఘ్ర దర్శనం క్యూలైన్లలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉగాది రోజు నుంచి వాటిని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
300 రూపాయల క్యూలైన్లను కూడా విపరీతమైన దూరం ఉందని పదే పదే భక్తులు నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని టిటిడి తీసుకుంది. ఆహార పదార్థాలు అందుబాటులో కూడా ఈ ప్రాంతంలో టిటిడి ఉంచనుంది. భక్తులకు కేటాయించిన సమయాన్ని బట్టి ఈ క్యూలైన్లలో భక్తులను అనుమతించనున్నారు. ఈ క్యూలైన్లను టిటిడి ఇఓ సాంబశివరావు తనిఖీ చేశారు.
మరోవైపు... తిరుమల శ్రీవారి దర్శనం గంటలోనే పూర్తవుతోంది. ప్రస్తుతం తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. క్యూలైన్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉండగా వారికి గంటన్నరలోపే స్వామివారి దర్శనం లభిస్తోంది.
అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి కూడా అదే సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 51,260 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.కోటి 55 లక్షల రూపాయలు వచ్చింది.
