తెలంగాణాకు మూడు రోజులు భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రానికి మూడు రోజుల పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష హెచ్చరికలను జారీచేసింది. సెప్టెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు ప్రకటించింది.
ఐఎండీ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు 17 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా 19, 20 తేదీల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.
భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్.. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించి, సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల పరిధిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మూసీ నదిలోకి నీటిని విడుదల చేయాల్సి వస్తే, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.
ఈ వర్షాలు రాష్ట్రంలో నెలకొన్న వర్షపాత లోటును కొంతమేర తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం వర్షపాత లోటు నమోదైంది. సెప్టెంబరు నెలలోనే ఇప్పటివరకు 28 శాతం లోటు ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని, పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
