గురువారం, 12 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జూన్ 2025 (22:36 IST)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

azaruddin
భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్‌కు కాంగ్రెస్ అధిష్టానం అతి పెద్ద బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం పట్ల అజారుద్దీన్ హర్షం వ్యక్తం చేస్తూ, తన కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు.
 
మంగళవారం అజారుద్దీన్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "నా కుమారుడు, మహమ్మద్ అసదుద్దీన్, తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రజా జీవితంలోకి అధికారికంగా అడుగుపెట్టడం నాకు ఎంతో గర్వంగా, భావోద్వేగంగా ఉంది" అని పేర్కొన్నారు. 
 
"ప్రజల పట్ల అతనికున్న నిబద్ధత, సేవా దృక్పథం, నిజాయతీలను నేను దగ్గరగా చూశాను. అతను వినమ్రంగా, ఏకాగ్రతతో, నిజమైన విలువలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ బాధ్యతను స్వీకరిస్తున్న అతనికి నా శుభాకాంక్షలు" అని అజారుద్దీన్ తన పోస్టులో రాశారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి 27 మంది ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్ మొదటి భార్య కుమారుడైన అసదుద్దీన్ ఒక దేశవాళీ క్రికెటర్. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను ఆయన వివాహం చేసుకున్నారు.
 
అజారుద్దీన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో అజారుద్దీన్‌పై 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, జూన్ 8న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌ను మరోసారి బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.