గురువారం, 5 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 30 మే 2025 (14:23 IST)

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

NIA arrests Telugu YouTuber Bayya Sunny
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్‌ను గురువారం రాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. అతడు ఆమధ్య కాలంలో 2 నెలల పాటు పాకిస్తాన్ దేశంలో పర్యటించడం, గూఢచర్యం ఆందోళనలకు సంబంధించి ఈ అరెస్టు జరిగిందని అధికారులు తెలిపారు. యాదవ్ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో జోడించిన మోటార్‌సైకిల్ పాకిస్తాన్ పర్యటన జాతీయ భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. ముఖ్యంగా భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, యాదవ్ తన పర్యటనలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డారా లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారా అని NIA దర్యాప్తు చేస్తోంది.
 
గూఢచర్యం వ్యవహారంబై దృష్టి సారించిన NIA అతడి కదలికలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో గూఢచర్యానికి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి NIA ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసింది. కాగా బయ్యా సన్నీ యాదవ్ పర్యటన స్వభావం, ఉద్దేశ్యాన్ని పరిశీలించడానికి అతని డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు.
 
అతని పాకిస్తాన్ పర్యటనకు ముందు, యాదవ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్రమ బెట్టింగ్ అప్లికేషన్‌లను ప్రోత్సహించడానికి సంబంధించిన కేసులో పాల్గొన్నాడని ఆరోపణలున్నాయి. దీనిద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడనే ఆరోపణులున్నాయి. అతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిలో మార్చి 5, 2025న సూర్యాపేటలోని నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు కూడా ఉంది. యాదవ్ విదేశాలలో ఉన్నప్పుడు అతని కోసం లుకౌట్ సర్క్యులర్ జారీ చేయబడింది. అతడి కోసం సెర్చ్ కూడా చేసారు.