సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2024 (08:23 IST)

కూల్చివేతలపై కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

ka paul
హైదరాబాద్ నగరంలో నీటి వనరుల పరిరక్షణ పేరిట అనేక అక్రమ భవన నిర్మాణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటుచేసింది. ఈ సంస్థకు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ కొనసాగున్నారు. గత కొన్ని రోజులుగా హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కూల్చివేతలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ప్రత్యామ్నాయం చూసుకునే వారకు బాధితులకు సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. 
 
పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అయితే, మూసీ బాధితులకు ఇళ్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నట్టు ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలను కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో హైడ్రా కూల్చివేతలపై బ్లాంకెట్ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.