1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (13:31 IST)

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న రజనీకాంత్

సినీ వినీలాకాశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలో ఎంతో ఘనంగా జరిగింది. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‏లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారతీయ సినీ రంగంలో ఉత్తమ నటన కనబరిచిన నటీనటులతోపాటు ఉత్తమ చిత్రాలగు అవార్డులు అందచేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువరు అవార్డులు అందుకున్నారు.
 
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. గత నాలుగు దశాబ్ధాలకు పైగా సినీ రంగంలో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నన్న రజనీ... కేవలం హీరోగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా సినీ పరిశ్రమలో నిజమైన సూపర్ స్టార్‌గా ఉన్నారు. 
 
ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినీ కళామతల్లికి రజినీ అందిస్తున్న విశేష సేవలకుగానూ కేంద్రం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా.. రజినీ తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
 
ఇకపోతే, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా మలయాళం నుంచి 'మరక్కర్' సినిమా నిలవగా.. 'భోంస్లే' చిత్రానికి మనోజ్ పాయ్.. 'అసురన్' చిత్రానికి ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. 'మణికర్ణిక' చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు.