1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (14:16 IST)

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు.. విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ!!

hema
బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ బెంగుళూరు నగర పోలీసులు కోరగా టాలీవుడ్ నటి హేమ డుమ్మాకొట్టారు. ఈ విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ఆమె కోరారు. బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికన వారిలో డ్రగ్ తీసుకున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగుళూరు సీసీబీ పోలీసులు నోటీలు జారీచేసిన విషయం తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 27వ తేదీ సోమవారం బెంగుళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో నటి హేమ కూడా ఉన్నారు. అయితే, ఆమె విచారణకు డుమ్మా కొట్టారు. 
 
ఇదే అంశంపై ఆమె బెంగుళూరు సీసీబీ పోలీసులకు ఓ లేఖ రాశారు. తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు. విచారణకు హజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించారు. అయితే, హేమ విజ్ఞప్తిని బెంగుళూరు పోలీసులు తిరస్కరించినట్టు సమాచారం. అదేసమయంలో ఆమెకు మరోమారు నోటీసులు పంపించాలని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, ఈ నెల 19వ తేదీన బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫాం‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెల్సిందే. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిందరికీ రక్తపరీక్షలు చేయగా, నటి హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీంతో వీరందరికీ నోటీసులు పంపించారు.