శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (16:15 IST)

నటనకు గుడ్‌బై చెప్పిన పూరి 'జ్యోతిలక్ష్మి' (Video)

తెలుగు చిత్రపరిశ్రమలో 'జ్యోతిలక్ష్మి'గా గుర్తింపు పొందిన హీరోయిన్ చార్మీ కౌర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఇష్టమైన హీరోయిన్. ఈయన నిర్మించే చిత్రాలకు సహ నిర్మాత. పైగా, చార్మీ నిర్మాతగా మారకముందు.. దాదాపు 50కి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఈ పంజాబీ ముద్దుగుమ్మ నిర్మాతగా మారిపోయింది.
 
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతిలక్ష్మి' సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన హీరోయిన్ పూరీ కనెక్ట్స్‌ అనే బ్యానరును స్థాపించి, దీనిపై వరుసగా పూరీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇక గతేడాది 'ఇస్మార్ట్ శంకర్‌'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై తాను వెండితెరపై కనిపించబోనని స్పష్టంచేసింది. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ప్రకటన చేసింది. 'జ్యోతిలక్ష్మి సమయంలోనూ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలనుకున్నా. అయితే నటించకూడదని అని నువ్వు నిర్ణయించుకుంటే నటనకు దూరంగా ఉండు.. కానీ బయటికి చెప్పకు అని నిర్మాత కల్యాణ్‌ తెలిపారు. అందుకే దానిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు చెబుతున్నా. యాక్టింగ్‌కి దూరంగా ఉంటా' అంటూ ఓ సంచలన ప్రకటన చేసింది. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ తెరకెక్కిస్తున్న 'ఫైటర్‌' సినిమాను కరణ్‌ జోహర్‌తో కలిసి ఛార్మీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మరో రెండు చిత్రాలను నిర్మించనున్నట్టు పేర్కొంది.అలాగే, వీలుపడితే వెబ్‌ సిరీస్‌లు నిర్మించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు ఈ పంజాబీ భామ చెప్పుకొచ్చింది.