1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (12:25 IST)

కొండా దంపతుల రాజకీయ ప్రయాణంతో తెరకెక్కిన "కొండా"

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ దంపతులు కొండా మురళి, కొండా సురేఖ. వరంగల్ జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసించారు. ఈ దంపతులు దశాబ్దకాలం పాటు జిల్లాలో తిరుగులోని ఆధిపత్యాన్ని చెలాయించారు. వారి రాజకీయ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు ఉన్నాయి. వాటి వెనుక ఉన్న భావోద్వేగాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవి ఎవరికీ తెలియవు. 
 
వీటన్నింటి మేళవింపుతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ "కొండా" పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో కొండా మురళిగా త్రిగుణ్ (అదిత్ అరుణ్) నటించగా, ఆయన భార్య సురేఖగా ఇర్రామోర్ నటించారు. 
 
"సమాజం గురించి నీతులు జెప్పుడు గాదు. బాగు చేయాలి. నీకు పోయేటందుకు ఏం లేవు. బానిస సంకెళ్లు తప్ప. విప్లవ పోరాటాలు చరిత్రను లాగే రైల్ ఇంజెన్లు. పెద్దందార్ల పెత్తనం భరించలేక, కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తుల ఉద్ఫవిస్తారని, కార్ల్ మార్క్స్ 180 యేళ్ల క్రితం చెప్పారు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టినవాడే కొండా మురళి" అని కొన్ని విజువల్స్‌ చూపిస్తూ రాంగోపాల్ వర్మ వాయిస్ వస్తుంది. 
 
ఇందులో ఎల్బీ శ్రీరామ్, జబర్దస్త్ రాంప్రసాద్, పృథ్వి, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథ, 24 కిస్సెస్ వంటి సినిమాలతో మెప్పించిన త్రిగుణ్ ఈ చిత్రం ఎలా మెప్పిస్తారో వేచిచూడాలి. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది.