శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జనవరి 2021 (18:43 IST)

దర్శకుడు క్రిష్‌కు కరోనా పాజిటివ్ : ఉపాసనకు కూడా సోకిందా?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురికి కరోనా వైరస్ సోకింది. వీరిలో బండ్ల గణేష్, ఎస్ఎస్ రాజమౌళి, నాగబాబు, చిరంజీవి వంటి అనేక మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అయినప్పటికీ.. మరికొందరు సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడుతూనే వున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
నిజానికి... ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను కేవలం 40 రోజుల్లోనే క్రిష్ పూర్తి చేశారు. ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మరో చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్న రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోహినూర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని 2021 ఫిబ్రవరి నుంచి పవన్ సినిమాను పట్టాలెక్కించాలని క్రిష్ భావించారు. 
 
కానీ ఇప్పుడు ఈయనకు కరోనా వచ్చింది. దాంతో మరికొన్ని రోజులు కూడా ఇప్పుడు క్వారంటైన్ లోనే ఉండాల్సిన పరిస్థితి. దాంతో పవన్ సినిమా షూటింగ్ కూడా అనుకున్న సమయానికి కాకుండా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పోయిందనుకుంటున్న ప్రతీసారి కరోనా వచ్చి తెలుగు ఇండస్ట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉంది.
 
కాగా, ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్, రామ్ చరణ్‌లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ ఇద్దరూ క్వారంటైన్‌కు పరిమితం అయిపోయారు. చెర్రీ భార్య ఉపాసన కూడా కరోనా బారిన పడ్డట్లే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో చాలా మందికి కరోనా సోకుతోంది.