1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 మే 2025 (13:21 IST)

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

Kannappa getup
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం "కన్నప్ప". ఈ చిత్రం జూన్ 27వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్‌ చోరీకి గురైంది. దీనిపై మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు.
 
ఈ ఘటనపై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మూవీ ప్రచార కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పిగా మారింది. దీంతో ఆ పరమ శివుడిని ప్రశ్నిస్తూ మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
 
"జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ? #హరహరమహదేవ్" అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంచు విష్ణుకు ఎదురైన పరిస్థితి చూసి ఆయన అభిమానులు ఎక్స్ వేదికగా ధైర్యం చెబుతున్నారు. 
 
ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేటు లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ కుమార్ వద్ద ఆఫీస బాయిగా పని చేసే రఘు అనే వ్యక్తి ఈ నెల 25న ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్‌ను తస్కరించి చరిత అనే మహిళకు అప్పగించాడు. అపహరణకు గురైన హార్డ్ డిస్క్ 1.30 గంటల సినిమా ఉందని, ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ అందులో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయకుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.