1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (13:34 IST)

'వర్మ'పై బయోపిక్ : పైశాచికం - విచ్చలవిడితనమే కథాంశంగా...

భారతీయ సినీ ఇండస్ట్రీలో ఉన్న వివాదాస్పద దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఈయన ఇప్పటివరకు పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలను ఆధారంగా చేసుకుని బయోపిక్‌లు నిర్మించారు. వాటిలో కొన్ని హిట్ కాగా, మరికొన్ని ఫట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత జొన్నవిత్తుల దర్శకుడు వర్మకు తేరుకోలేని షాకిచ్చారు. 
 
రాంగోపాల్ వర్మ పైశాచికం, ఆయ‌న విచ్చ‌ల‌విడిత‌నం అనే అంశాలను నేపథ్యంగా తీసుకుని ఓ సినిమా తీయనున్నట్టు చెప్పారు. అన్న‌ట్టుగానే వ‌ర్మ బ‌యోపిక్ సినిమాకి సంబంధించి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.
 
వ‌ర్మ తెర‌కెక్కించిన 'అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు' సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆర్జీవీ కొన్ని విష‌యాల‌పై తీవ్రంగా స్పందించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ముఖ ర‌చ‌యిత జొన్న‌విత్తుల మండిప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య అనేక వాగ్వాదాలు చోటుచేసుకోగా, ఆర్జీవి.. జొన్న‌విత్తుల‌ని జొన్నపొత్తు అని కామెంట్ చేయ‌డం, జొన్నవిత్తుల‌.. వ‌ర్మ‌ని పప్పు వ‌ర్మ అని కామెంట్ చేయ‌డంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
 
ఈ నేపథ్యంలో వర్మ తనపై చేసిన కామెంట్స్‌కు ఒళ్లు మండిన జొన్నవిత్తుల వ‌ర్మ‌పై బ‌యోపిక్ త‌ప్ప‌క చేస్తాన‌ని, దాన్ని మియామాల్కోవాకు అంకితం ఇస్తానని ప్రకటించారు. ఆయన అన్న‌ట్టుగానే ఇప్పటికే ఆ సినిమా ప‌నులు ప్రారంభించార‌ు. 
 
వర్మలా ఉండే ఓ వ్యక్తిని.. బీహార్ నుంచి పట్టుకొచ్చాడ‌ని అంటున్నారు. ఆయ‌న‌కి న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇప్పిస్తుండ‌డంతో పాటు వ‌ర్మ మేన‌రిజాన్ని అనుక‌రించేలా ట్రైనింగ్ ఇస్తున్నార‌ట‌. అయితే, ఇందులో నిజమెంత అనే విషయాన్ని జొన్నవిత్తులే స్వయంగా వెల్లడించాల్సివుంటుంది.