1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (10:14 IST)

పబ్‌లో గాయకుడు సిద్ శ్రీరామ్‌ను అవమానించిన పోకిరీలు

ముఖ సినీ నేపథ్యగాయకుడు సిద్ శ్రీరామ్‌ను పలువురు పోకిరీలు అవమానించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్‌లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఆయన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని సన్‌బర్న్‌ పబ్‌లో నిర్వహించిన వేడుకకు సిద్ శ్రీరామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్‌ శ్రీరాం వస్తుండటంతో నిర్వాహకులు టిక్కెట్లు అడ్డగోలుగా విక్రయించారు. కేవలం 500 మంది లోపు సరిపోయే ఈ ప్రాంగణంలో వందలాది మందిని అనుమతించారు. 
 
సిద్‌ శ్రీరాం ఒకవైపు తన బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతుండగా పై నుంచి కొందరు ఆకతాయిలు మద్యంతోపాటు నీళ్లు చల్లారు. ఆయా బృంద సభ్యులపై అవి పడటంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపారు. ఆ తర్వాత సిద్ శ్రీరామ్ ఆ పోకిరీలపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. 
 
అయితే, ఈ కార్యక్రమానికి మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదికాకముందే.. నిర్వాహకులు అప్రమత్తమై సమస్యను పరిష్కరించారు. 
 
అనంతరం తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందిస్తూ.. 'మనసును అదుపులో పెట్టుకొంటే పనిచేసే ప్రాంతంలో భయం ఉండదంటూ' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం బహిర్గతమైంది. 
 
అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ పోలీసు అధికారుల పాత్రపై పలు ఆరోపణలు వస్తున్నాయి.