1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (19:28 IST)

సినీ పరిశ్రమలను కుదిపేస్తున్న ఒమిక్రాన్...ఎలా..?

ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ సినీపరిశ్రమను కూడా ఓ రేంజ్‌లో దెబ్బతీస్తోంది.  కరోనా మొదటి, రెండవ వేవ్‌ల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమకు పూర్వకళ వస్తోంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రపంచంపై దాడి చేసిన ఒమిక్రాన్ పాన్ ఇండియా మూవీలపై దెబ్బ కొడుతోంది.

 
వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి మార్కెట్లను దున్నేద్దామనుకుంటున్న పాన్ ఇండియా మూవీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది ఒమిక్రాన్. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ ఉండడంతో కట్టడి చర్యలు దిగుతున్నాయి ప్రభుత్వాలు.

 
అందులోను వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహారాష్ట్ర థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తున్నామంటూ ప్రకటించారు. థియేటర్లపై ఆంక్షలు విధిస్తున్నామని ప్రకటించడంతో సినిమాలు ఆక్యుపెన్సీ భారీగా పడిపోనుంది.

 
దీంతో ఆర్ఆర్ఆర్‌తో పాటు రాధేశ్యామ్ టీంకు టెన్షన్ పట్టుకుంది. జనవరి 7 ఆర్ఆర్ఆర్, సంక్రాంతి కానుకగా 14వ తేదీన రాధేశ్యామ్‌లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇక 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కితే, అదే రేంజ్‌లో 350 కోట్లతో రాధేశ్యామ్ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. 
 
ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్‌తో థియేటర్లు భారీగా మూతపడితే భారీ నష్టాలు తప్పవని నిర్మాతలకు దిగులు పట్టుకుంది. ఓవర్సీస్ నిర్మాణంలో మార్కెట్లు కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే పెద్ద సినిమాలు విడుదలకు సిద్థంగా ఉన్నాయి.
 
కరోనా కారణంగా గతంలో విడుదల కావాల్సిన సినిమాలు విడుదల కాలేదు. ఇప్పుడు అవన్నీ విడుదలకు సిద్థంగా ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లు జనవరిలోనే రిలీజ్ కానుండగా, బంగార్రాజు, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కార్ వారి పాట సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
 
భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా పాన్ ఇండియా సినిమాలకు క్లాష్ రాకుండా చూడాలన్న నిర్మాతల విజ్ఞప్తితో పవన్ వెనక్కి తగ్గారు. ఇప్పుడు మరోసారి ఒమిక్రాన్ కమ్మేస్తోంది. దీని ప్రభావం సినిమాలపై పడనుంది.