1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (15:14 IST)

పిల్లలు ఎపుడూ చిప్స్ తింటున్నారా?

chips
చాలా మంది పిల్లలు పొద్దస్తమానం చిప్స్ ఆరగిస్తుంటారు. నిజానికి ఎపుడో ఒకసారి ఆరగిస్తే తింటే ఏం ఫర్లాదు కానీ, కొందరు పిల్లలు పొద్దస్తమానం అదేపనిగా ఆరగిస్తుంటారు. ఇలా తినడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. సాధారణంగా చిప్స్ రెండురకాలు ఉంటాయి. ఒకటి బంగాళాదుంప, అరటివంటి వాటితో చేసేవి, మరొకటి పిండితో వండేవి. ఇవన్నీ నూనెలో ఎక్కువగా వేయిస్తారు. ఇంట్లో చేసినవి అయితే కాస్త పర్వాలేదు అదే బయట దొరికే స్నాక్స్‌లో రకరకాల మసాలాలు, కారప్పొడులు, ఉప్పు వంటివి ఎక్కువగా కలిపి తయారు చేస్తారు. నోటికి రుచిగా కరకరలాడుతూ ఎక్కువ సేపు నమిలే శ్రమ లేకుండా ఉన్నాయని వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు పిల్లలు. ఈ రుచికి అలవాటు పడటంవల్ల వాళ్ల నాలుక వాటినే ఎక్కువగా కోరుకుంటుంది. 
 
అవి తింటే చాలు, వాళ్ల పొట్ట నిండిపోతుంది. కాబట్టి వేరే ఆహారం తినాలనిపించదు. చిప్స్ కెలోరీలు ఎక్కువగా ఉంటాయి. శరీర పనితీరుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు వీటిద్వారా అందవు. దాని కారణంగా ఐరన్, జింక్, విటమిన్-ఎ, సి లోపాలు తలెత్తుతాయి. అంతేకాదు, త్వరగా అలసిపోవడం, ఏదైనా అనారోగ్యం వస్తే తొందరగా నయం కాకపోవడం, చివరకు కంటిచూపును కోల్పోయే పరిస్థితి కూడా పిల్లల్లో రావొచ్చు. కాబట్టి నెమ్మదిగా వారితో మానిపించే ప్రయత్నం చేయాలి. అలాఅని వెంటనే చిప్స్ తినొద్దు అంటే వినరు. వారం పదిరోజులకోసారి ఇస్తూ వాటిని తింటే వచ్చే దుష్ఫలితాల గురించి చెప్పాలి. భోజనంలో నూనె, పప్పు గింజలు, తృణధాన్యాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, అన్ని రంగుల పండ్లూ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటైతే క్రమేణా వాళ్లే చిప్స్ అడగడం మానేస్తారు.