బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:42 IST)

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు... మార్చి 13న రాష్ట్ర బడ్జెట్‌

అమరావతిలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి ఆరో తేదీ నుంచి శాసనసభ సమావేశాలను ప్రారంభించి 13న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1.54 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్

అమరావతిలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి ఆరో తేదీ నుంచి శాసనసభ సమావేశాలను ప్రారంభించి 13న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1.54 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్‌ను రూ.1.36 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఆర్థిక శాఖ సమీక్ష సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. తొలుత బడ్జెట్‌ సమావేశాలను మార్చి 3 నుంచి ప్రారంభించి బడ్జెట్‌ను 6 లేదా 8వ తేదీన ప్రవేశపెట్టాలని భావించారు. దీనిపై తర్జనభర్జనలు పడిన ప్రభుత్వం తేదీలను మార్చింది.
 
ఈసారి వివిధ శాఖల నుంచి వచ్చిన బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏకంగా రూ.2 లక్షల కోట్లను దాటాయి. ఆ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగే అవకాశం లేకపోవడంతో బడ్జెట్‌ కేటాయింపులకు పగ్గాలు వేయాలని ఆర్థిక శాఖ ముందు నుంచి పట్టుదలతో ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయా శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలకు భారీగా కోత వేసి రూ.1.54 లక్షల కోట్లకే కట్టడి చేసింది. బడ్జెట్‌ నిధుల కేటాయింపులో ప్రధానంగా విద్య, సంక్షేమం, జలవనరుల శాఖలదే పెద్ద పద్దుగా ఉండే సూచనలున్నాయి.