ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (20:15 IST)

విజయవాడ టు పులివెందుల.. మరో కార్యాలయం తరలింపు?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తోంది. ఇప్పటికే వైజాగ్‌కు కొన్ని కార్యాలయాలను తరలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు విజయవాడ నుంచి పులివెందులకు వెటర్నరీ, బయోలాజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను తరలించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ విజ్ఞప్తి మేరకు కంకిపాడులోని వీబీఆర్‌ఐని కడప జిల్లాకు తరలించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగులకు పులివెందులలో క్వార్టర్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఇటీవల విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంట్రోల్ రూంను విజయవాడ నుంచి విశాఖ తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కంట్రోల్ రూం ఏర్పాటుకు కేటాయించిన రూ.13.8 కోట్లను విశాఖకు బదలాయిస్తున్న ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండాల్సిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని 400 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడమంటే రాజధానిని విశాఖకు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదొక కీలక ఘట్టంగా స్పష్టమవుతోంది. 
 
రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అక్కడి సీసీ కెమెరాలు లేదా డ్రోన్ల ద్వారా వీడియో ఫుటేజ్‌ తీసుకుని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. అలాంటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అధికారులు ఉండే ప్రాంతంలో కాకుండా మరోచోట ఏ ప్రభుత్వమూ ఏర్పాటు చేయదు. అందుకు పోలీసు శాఖ కూడా సమ్మతి తెలపదు. 
 
గత ప్రభుత్వంలో ఈ సెంటర్‌ ఏర్పాటుకు విజయవాడలో స్థలం ఎంపిక చేసి రూ.13.80 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రదిపాదన అలా ఆగిపోయింది. తాజాగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విశాఖకు పరిపాలన రాజధానిని మార్చే ఆలోచనలో భాగంగా అంతే మొత్తంతో అక్కడ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. 
 
మొత్తంమీద పాలనా వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా, మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనేక ప్రభుత్వ కార్యాలయాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోంది. ఇందులోభాగంగానే తాజాగా మరో కార్యాలయాన్ని సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు తరలించింది.