ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను చెన్నై ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ ఇద్దరు ఉగ్రవాదులు దశాబ్దాలు రహస్య జీవితం గడుపుతూ వచ్చారు. వీరిని చెన్నై ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న సిద్ధిఖీ, మహ్మద్ అలీ అనే సోదరులు మారు పేర్లతో గత 30 యేళ్లుగా రాయచోటిలో చీరల వ్యాపారం చేస్తూ రహస్యంగా జీవిస్తున్నారు.
వీరు గత 1985లో కోయంబత్తూరులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎక్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా కుట్ర చేసినట్టు వీరిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరు ఇద్దరు మారుపేర్లతో రాయచోటిలో ఉన్నట్టు గుర్తించిన చెన్నై ఐబీ అధికారులు.. మంగళవారం స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు.
వీరు ఉన్న నివాసం నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, కొంత సామాగ్రిని ఐబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ చెన్నై తీసుకుని వెళ్లారు. గత మూడు దశాబ్దాలుగా బట్టల వ్యాపారం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్న ఈ సోదరులు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారని తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పైగా, తమిళనాడు నుంచి వచ్చిన పోలీసులు ఈ ఇద్దరు అన్నదమ్ములను అరెస్టు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.