బయోసైన్స్ మెథడాలజీలో గణితం సబ్జెక్టు చేర్చారనీ హెయిర్ డై తాగి విద్యార్థిని సూసైడ్
విద్యాశాఖ అధికారులు సంబంధం లేని సబ్జెక్టులతో లింకులు పెడుతున్నారు. ఈ సబ్జెక్టులతో విద్యార్థులు రాణించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఓ చదువుల తల్లి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కాకునూరి ప్రమీల అనే 22 యేళ్ళ యువతి.. బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఎమ్మెస్సీ చేస్తోంది. అదేసమయంలో బయోసైన్స్ మెథడాలజీ సబ్జెక్టుపై ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సిద్ధమవుతోంది.
అయితే, బయోసైన్స్ మెథడాలజీలో గణితం సబ్జెక్టును టెట్ సిలబస్లో చేర్చారు. మెథడాలజీకి గణితంకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొన్న ఆ యువతి.. సంబంధం లేని సబ్జెక్టులో రాణించాలంటే ఇబ్బందిగా ఉందని మనస్సులో మథనపడుతూ వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా ఓ లేఖ రాసి.. దాన్ని పోస్ట్ చేయకుండా తన వద్దే ఉంచుకుంది.
ఈ పరిస్థితుల్లో ప్రమీల.. శనివారం రాత్రి హెయిర్ డై (జుట్టుకు పూసుకునే రంగు) సేవించింది. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆ యువతి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.