కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన ఓల్వా బస్సు(AP02 TC 7146) కృష్
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్కు చెందిన ఓల్వా బస్సు(AP02 TC 7146) కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడర్ను ఢీకొని కల్వర్టు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రయాణికులు మృతిచెందగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగంతో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, డ్రైవర్ నిద్రమత్తుతో బస్సును నడపడంతో ప్రమాదం జరిగిందని కథనాలు వినపడుతున్నాయి.
పెనుగంచిప్రోలు, నందిగామ పోలీసులు, ముళ్లపాడు గ్రామస్థులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మూడు అంబులెన్స్ల సాయంతో క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కు పోవడంతో ప్రయాణికులను బయటకు తీయడం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. పలువురు ప్రయాణికులు ఇంకా బస్సులోనే ఇరుక్కుని ఉండటంతో గ్యాస్ కట్టర్ల సాయంలో బస్సు భాగాలను వేరుచేసి వారిని బయటకు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.