1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 మే 2025 (08:55 IST)

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

Simhachalam
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఇటీవల గోడకూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలిన ఏడుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అదేసమయంలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు అతనిపై మరో ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. 
 
సింహాచలం ఆలయ ప్రాంగంణంలో గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఘటనకు గల కారణాలను, బాధ్యులను గుర్తించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షుణ్ణంగా విచారణ జరిపి, ప్రభుత్వానికి తమ నివేదిక అందజేసింది. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. 
 
ఈ కమిటీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీ టీడీసీ)కు చెందిన ఏడుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
సస్పెన్షన్‌కు గురైన వారిలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సుబ్బారావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈలు కేఎస్ఎన్ మూర్తి, స్వామి, ఏపీటీడీసీ అసిస్టెంట్ ఇంజనీర్ పి.మదన్, ఆలయం జూనియర్ ఇంజనీర్ కే.బాబ్జిలు ఉన్నారు. 
 
వీరితో పాటు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను కూడా పూర్తి బాధ్యుడుని చేస్తూ, అతడిని బ్లాక్ లిస్టులో చేర్చాలని ప్రభుత్వాని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా, సదరు కాంట్రాక్టర్‌తో పాటు నిర్లక్ష్యాన్ని బాధ్యులైన ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ చర్యల ద్వారా భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది.